శంకరులను ప్రభావితం చేసిన గౌడపాదులు!!
అద్వైత సిద్ధాంతానికి అతి ప్రముఖులైన వారిలో గౌడపాదులు ఒకరు. ఈయన క్రీ.శ. 800 ప్రాంతం వారని చరిత్రకారుల అభిప్రాయం. వీరు శ్రీశుకుల శిష్యులని అంటారు. గౌడపాదుల శిష్యులు గోవిందపాదులు, వారి శిష్యులు శ్రీ శంకరులు. అంటే గౌడపాధుల నుండి గోవిందపాదులు, గోవిందపాదుల నుండి శంకరులు అద్వైతాన్ని అందిపుచ్చుకున్నారని చెప్పవచ్చు.
గౌడపాదులు అనేక రచనలు చేసినట్లు చెప్తున్నా, మాండూక్యోపనిషత్తు మీద వారి కారికలు అద్వైత సిద్ధాంతానికి పునాదులు వేశాయని అనడం నిర్వివాదాంశం. వీరి కాలంలో విశేష ప్రచారంలో నున్న బౌద్ధం వల్ల వీరు ప్రభావితం అయ్యారని, అద్వైతానికి భౌద్ధమతం వ్యతిరేకం అయినా, గౌడపాదులు బౌద్ధమత సిద్ధాంతాలను అంగీకరించారని కొందరు విమర్శకుల అభిప్రాయం.
గౌడపాదుల వారి మాండూక్యకారికలు నాలుగు భాగాలుగా విభజింపబడ్డాయి.
వాటిలో మొదటిది ఆగమ ప్రకరణం:-
దీనిలో ఆయన మాండ్యూకోపనిషత్తుకు అర్థవివరణ చేసి, తాను ప్రతిపాదించిన పరమార్థతత్త్వం వేదవిహితమని, హేతుబద్ధమని నిరూపించడానికి ప్రయత్నం చేశారు. ఇందులోనే ఓంకార తత్త్వాన్ని కూడా నిరూపించారు.
రెండవది వైతథ్యప్రకరణం:-
'వితథ' అంటే వాస్తవ స్వరూపం కంటే భిన్నంగా కనిపించడం. 'వైతథ్యము' అంటే అనిత్యమైనది అని అర్థం. దీని ద్వారా ప్రపంచ మిథ్యాత్వాన్ని ప్రతిపాదించారు.
మూడవది అద్వైత ప్రకరణం:-
దీనిలో అద్వైత సిద్ధాంతం వివరించబడింది. శంకరులు ఈ అద్వైత సిద్ధాంతాన్ని గౌడపాదుల శిష్యుడు గోవిందపాదుల దగ్గర అధ్యయనం చేశారు. అలాగే అనుసరించారు కూడా.
నాల్గవది అలాతశాంత ప్రకరణం:-
వేద ప్రమాణాన్ని అంగీకరించని బౌద్ధం మొదలైన సిద్ధాంతాలు ఇందులో ఖండించబడ్డాయి. ప్రతి సిద్ధాంతాలకు కొన్ని ప్రమాణాలు ఉన్నట్టే, వేదాలు కూడా సిద్ధాంతాపరమైనవి అని ఈయన చెప్పారు.
వీరు అద్వైత సిద్ధాంతంలోని ప్రధాన అంశాలు అయిన జీవబ్రహ్మైకత్వాన్ని, మాయావాదాన్ని, ప్రాతిభాసికసత్యం, వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం అనే సత్య విభజనను చేశారు. ఇంకా ఈయన మోక్షానికి జ్ఞానమొకటే మార్గమని ప్రతిపాదించారు.
వీరు కార్యం కారణంలో ఉండదనే న్యాయ-వైశేషికులు ప్రతిపాదించిన అసత్కార్యవాదాన్ని కార్యం కారణంలో ఉంటుందనే సాంఖ్యుల సత్కార్యవాదాన్ని, బౌద్ధుల విజ్ఞాన వాదాన్ని ఖండించారు. సృష్టికి 'అజాత' వాదాన్ని ప్రవేశపెట్టారు. విశ్వం ఎప్పుడూ పుట్టలేదని, అది పరమాత్మలోనే ఉందని, దానిని వ్యక్తం చేయడం పరమాత్మ స్వభావం అని అన్నారు. 'మాయ' అంటే ఆయన దృష్టిలో పరమాత్మ యొక్క అద్భుత శక్తి. ఇది అందరూ నమ్ముతారు ప్రస్తుత కాలంలో. అయితే మాయ అందరూ అనుకుంటున్నట్టు ప్రత్యక్షం కావడం, తరువాత అంతర్థానం అవ్వడం కాదు. మాయ అంటే ప్రపంచం అంతా ఆవరించి, అన్నిటినీ తన ఎరుకతోనే నడిపించడం. ఇదే ఆ దేవుడి మాయ.
జాగృత్, స్వప్న, సుషుప్త్యవస్థలు దాటిన తరువాత తురీయంలో ఆత్మానుభవం కలుగుతుందని గౌడపాధుల వారి సిద్ధాంతం.
గౌడపాదుల శిష్యులు గోవిందపాదులు. వీరివద్ద శంకరులు అద్వైత సిద్ధాంతాన్ని అధ్యయనం చేశారు. ఇలా శంకరుల అద్వైత సాధన వెనుక గౌడపాదుల వారి మూలబీజం దాగి ఉంది.
◆ వెంకటేష్ పువ్వాడ