భారతీయ సాహిత్యంలో ఎందరో గొప్ప గొప్ప సాహిత్య వేత్తలు. కొందరు సాక్షాత్తు ఆ భగవంతుని స్తుతిస్తూ జన్మను ధాన్యం చేసుకున్నవారు అయితే మరికొందరు ఆ భగవంతుడి చల్లని కరుణకు పాత్రులయ్యి చరిత్రలో నిలిచినవారు.
పాండిత్యమే లేని కాళిదాసు అమ్మవారి కరుణ వల్ల మహకవిగా మారిపోవడం చాలామందికి తెలుసు. కానీ కాళిదాసు తరువాత అచ్చం ఆ భగవంతుడి అనుగ్రహముతో పాండిత్యంలో తనదైన ముద్ర వేసుకుని ఆ భగవంతుడి భక్తుడిగా పేరొందినవాడు "గౌడ డిండిమభట్టు"
అరుణాచలం వెళ్ళిన వారు, వెళ్లబోయే వారు తప్పక తెలుసుకోవలసిన విషయం డిండిమభట్టు గురించి. అక్కడ ఆలయం లోపలకి వెళ్లేటప్పుడు మొదట ఒక సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం ఉంటుంది, ఈ స్వామి ఎంతో మహత్యం కలిగినవాడు. అక్కడే అరుణగిరినాధుడు అనే గొప్ప కవి పండితుడిని అనుగ్రహించాడు సుబ్రహ్మణ్య స్వామి.
అరుణగిరినాథుడు శ్రీనాథుని కాలంలో ప్రసిద్ధిచెందిన కవి పండితుడు. ఇతనినే "గౌడ డిండిమభట్టు" అని పిలిచేవారు. ఈయన యవ్వనంలో కొంత బాధ్యత లేకుండా తిరుగుతూ, చెడు వ్యసనాలకు బానిసై చివరికి మొండి రోగం బారిన పడి, చూసే దిక్కు లేక జీవితం మీద విరక్తి పుట్టి బాధపడుతున్నపుడు ఒక సాధువు ఈయన దగ్గరకు వచ్చి, దేవుడిని ప్రార్థించు, ఆయన కరుణిస్తే నీ జన్మ ధన్యమవుతుంది. సమస్యలు దూదిపింజల్లా తేలిపోతాయి అని చెప్పాడు. ఆ అరుణాచలేశ్వరుడే అలా చెప్పాడని చాలామంది నమ్మకం.
డిండిమభట్టు దేవుడిని ఎంత ప్రార్తించినా ఫలితం కనిపించలేదు. ఈ జీవితం ఎందుకు బతికుండటం వ్యర్థం అనుకుని తిరువణ్ణామలై లోని అరుణాచలేశ్వర ఆలయంలోని ఉత్తరగోపురం ఎక్కి ఆత్మహత్య చేసుకుందామని క్రిందకి దూకాడు, అప్పుడు కుమారస్వామి ప్రత్యక్షమై పడిపోకుండా పట్టుకుని క్రిందకు దించి నాలుకపై షడక్షరిని లిఖించి, ఇప్పుడు నా గురించి ఏదైనా కీర్తన చెప్పు అన్నాడట. అపుడు డిండిమభట్టు నోటినుండి ఆశువుగా వచ్చిన కీర్తనే ముత్తై తారు పతి. ఆ కీర్తన ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది జరిగిన ఆ ప్రదేశం సుబ్రహ్మణ్యేశ్వర కోవెలగా అరుణాచలేశ్వరాలయంలో ఉంది, ఇప్పటికి అరుణాచలం వెళ్ళినపుడు లోపలికి వెళ్తున్నపుడు ఎడమ ప్రక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం దర్శనం చేసుకోవచ్చు.
అరుణగిరి నాథుని భక్తికి, భక్తి రచనకు అడ్డులేదు. వేల కొలది కీర్తనలు ప్రజల నాలుకపై నాట్యమాడాయి. ఒకసారి ప్రాఢదేవరాయల మంత్రి, సభలో అరుణగిరి నాథునితో నేను అమ్మవారిని ఈ సభలో ప్రత్యేక్షం అయ్యేలా చేస్తాను, నీలో నిజమైన భక్తి ఉంటే నువ్వు అందరూ అనుకుంటున్నట్టు గొప్పవాడివి అయితే కుమారస్వామిని ఈ సభలో ప్రత్యక్షం అయ్యేలా చెయ్యి అని సవాలు చేశాడు. అప్పుడు అరుణగిరినాథుడు 'ఆతల సదా నారద' అనే గీతాన్ని కుమారస్వామిని ఉద్దేశించి పాడగా దివ్య కాంతులు వెదజల్లుతూ క్షణ కాలం దర్శనమిచ్చి అంతర్దానమైనాడు కుమారస్వామి
కాళిదాసును అమ్మవారు అనుగ్రహించినట్టు డిండిమభట్టును కుమారస్వామి అనుగ్రహించిన విషయం చాలా కొద్దిమందికె తెలిసి ఉంటుంది. ఏది ఏమైనా గౌడ డిండిమభట్టు అరుణగిరినాధుడిగా వేల కీర్తనలు అందించిన గొప్ప భక్తుడు మరియు సాహితీకారుడు.
◆ వెంకటేష్ పువ్వాడ