మనిషి స్వభావానికి చక్కని భాష్యం!!
【అచ్ఛేద్యో౨ యమదాహ్యో౨ యమక్లేద్యో౨ శోష్య ఏవచ।
నిత్యస్సర్వగతః స్థాణుఃరచలో౨ యం సనాతనః||
ఈ ఆత్మ ఛేదించబడదు. దహింపబడదు. తడప బడదు. ఎండకు, గాలికి శోషించిపోదు. ఎందుకంటే ఇది నిత్యమైనది, సత్యమైనది. అన్ని ప్రాణులలో అంతర్యామిగా వెలుగుతుండేది. చలనము లేనిది. స్థిరంగా ఉండేది. అన్నిటి కంటే సనాతనమైనది. ఇది ఎప్పటి నుండి ఉందో ఎవరూ చెప్పలేరు】
ఇది నిత్యము. నిత్యము అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది అని అర్థం. మీరు ఎవరినన్నా దీవించాల్సి వస్తే శతమానం భవతి అని గానీ చిరంజీవి అని కానీ దీవిస్తారు. అంటే కలకాలం జీవించు అని అంతేకాని ఉన్నంత కాలం సుఖంగా ఉండు అని ఎవరూ అనరు. ఎందుకంటే ప్రతి వాడికీ చాలాకాలం జీవించాలని కోరిక బలంగా ఉంటుంది. ఇంకా సర్వగతః అంటే సర్వత్రా నిండి ఉండేది. అక్కడ ఉంది ఇక్కడ లేదు అనే ప్రశ్నలేదు. స్థాణుః అంటే కదలకుండా ఉన్నావు అనికాదు. ఈశ్వరుడి నామాలలో స్థాణువు అని కూడా ఉంది. అంటే కదలకుండా ఒక చోట కూర్చున్నాడు అని అర్థం కాదు. అన్ని కాలాలలోనూ, అన్ని చోట్లా స్థిరంగా ఎటువంటి మార్పులేకుండా నిలిచి ఉండే దానిని స్థాణువు అంటారు. పరమ శివునికి స్థాణువు అని పేరు. అంటే అన్ని కాలాలలోనూ ఆ పరమేశ్వరుడు ఉంటాడు అని అర్థం.
సర్వగతః అన్నా స్థాణువు అన్నా ఒకటే. ఇంకా అచల: అంటే చలనము లేనిది. ఇది కూడా పై శబ్దాలకు పర్యాయపదమే. ఒక చోట ఖాళీ ఉంటే ఇక్కడ నుండి అక్కడకు చలనం కలుగుతుంది. అంతటా నిండి ఉంటే ఇంక కదలడానికి, పక్కకు జరగడానికి చోటు ఎక్కడుంది. ఒక డబ్బాలో బియ్యం నిండుగా పోసాము. గట్టిగా మూత పెట్టాము. అటు ఇటు ఆడించాము. లోపల బియ్యం కదలవు. ఎందుకంటే వాటికి కదలడానికి జరగడానికి లోపల స్థలం లేదు. డబ్బా అంతటా బియ్యం నిండుగా ఉన్నాయి. అలాగే పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు, జరగడానికి స్థలం లేదు కాబట్టి చలనం లేదు. అందుకే అచల: అన్నారు. సనాతనః అంటే అతి పురాతనమైనా నిత్యం కొత్తగా ఉండేది. ఈ గుణములు, లక్షణములు కలిగిన ఆత్మ నీలోనూ నాలోనూ, అందరిలోనూ ఉంది. అని అన్నాడు కృష్ణుడు.
ఆత్మ శాశ్వతము అయితే అనాత్మ అయిన శరీరం అశాశ్వతము అనే అర్థం. ఇక్కడ శాస్త్రము ఒక ప్రశ్న వేస్తుంది. మానవుడు తన శరీరము అశాశ్వతము అని ఎందుకు గుర్తించలేకపోతున్నాడు అని. దానికి ఒకే జవాబు. మానవుడికి అలా అనుకోవడం నచ్చదు. నచ్చని పని ఎవరూ చేయరు. మరణం అనే పదం మనకు నచ్చదు. అందుకని ఈ శరీరము అశాశ్వతము అనే ఆలోచనను కూడా మనం మనసులోకి రానీయము. ఎందుకంటే శరీరము అశాశ్వతము అని అనుకోవడం మన స్వభావం కాదు. చిరకాలం జీవించడం మన స్వభావము. దానికి విరుద్ధమైన భావాన్ని మనం అంగీకరించము. అలాగే మనకంతా తెలుసు అన్నది మన స్వభావము. ఎవరినన్నా నీకు తెలియదు అంటే వాడు మన మీదికి పోట్లాటకు వస్తాడు. ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి అని అనుకోవడం మన స్వభావము అందుకే దేవుడిని "నాలుగు కాలాల పాటు సుఖంగా ఉండేటట్టు చూడు స్వామీ" అని మొక్కుకుంటాము. అంతే కానీ నాకు దుఃఖము ప్రసాదించు స్వామి అని మొక్కము.
కాబట్టి మన స్వభావానికి విరుద్ధంగా మనము ఏమి మాట్లాడము, ఏదీ చెయ్యము. అందుకే కృష్ణుడు అర్జునునితో నీ స్వభావము యుద్ధం చేయడం. శరీరం స్వభావము నాశనం కావడం. ఆత్మ స్వభావము నిత్యంగా ఉండటం. నిత్యమైన ఆత్మ ఎప్పటికీ నశించి పోదు, అశాశ్వతమైన శరీరం నీవు చంపకపోయినా చస్తుంది. కాబట్టి నీ స్వభావాన్ని అనుసరించి యుద్ధం చెయ్యి. అని బోధించాడు కృష్ణుడు.
◆ వెంకటేష్ పువ్వాడ