నాగుల చవితి విశిష్టత
దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు"కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.
దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే! కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!
పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ!
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా !
అలా! ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద 'దీపావళి నాటి మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖసంతానము; అదే కన్నె పిల్లలు ఆరాధిస్తే! మంచి భర్త లభించునని పలువురి విశ్వాసము. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిదికాదు. యుగాలనాటిది. సౌభాగ్యానికి, సంతానప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల శరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాధలు కానవస్తున్నాయి.
దేశమంతట పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ "నాగులచవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం. నాగేంద్రా! మేము మా వంశములోవారము నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున"తోకతొక్కితే తొలగిపో. నడుంతొక్కితే నా వాడనుకో! పడగ త్రొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రీ! అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కరాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. నూకని పుట్ట చుట్టూ నూకలు నువ్వు తీసుకుని మూకలు మాకివ్వు తండ్రీ అని చల్లి పుట్టమన్ను చెవులకి పెట్టుకుంటాము. మనకి పంట సరిగ్గా పండి మన పొట్ట నిండటానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్కరోజన్నా మనసారా తలుచుకుని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
నాగులచవితిరోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్ ||
ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరంపూలు, లడ్డు మున్నగునవి ప్రీతికరమని చెప్తారు. సర్పారాధనచేసే వారి వంశం 'తామరతంపరంగా' వర్ధిల్లు తుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్లల్లో ఇలవేల్పు సుబ్రహ్మణేశ్వరుడే! ఆయన అందరికీ ఆరాధ్య దైవంకాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు, ఫణి, సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు.
తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తలతోకయనక యుండు ఖలునకు నిలువెల్ల విషము గదరాసుమతీ!
అని చెప్పినట్లు...అలా మనచుట్టూ మానవరూపంలో ఉండే మానవులు; సర్పజాతి మనసుకంటే; నికృష్టమైన (అంటే! అవి మనంవాటి జోలికి వెళితేనే ప్రమాదకరమవుతాయి.), వాటికంటే భయంకరమైన మానవ సర్పాలు మనచుట్టూ తిరుగుతున్నా గమనించలేక పోతున్నాం! అని గ్రహించుకోవలసి ఉంది. నాగర్కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉందిట! దాని సమీపంలో 6నెలలు తెల్లని ఇసుక, 6నెలలు నల్లని ఇసుక భూమిలో నుండి ఉబికి ప్తెకివస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు. నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులలో ఉపయోగిస్తారని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది.
యోగీశ్వరో మహాశయనా కార్తికేయోగ్ని నందనః |
స్కందః కుమారః సేనాని స్వామీ శంకర సంభవః ||
గాంగేయ స్థామ్ర చూడశ్చ బ్రహ్మచారి షికిధ్వజః |
తారకారి ఉమాపుత్ర క్రౌంచారీశ్చ షడాననః ||
శబ్ద బ్రహ్మ సముద్రశ్చ సిద్ధః సారస్వతౌ గుహః |
సనత్ కుమారౌ భగవాన్ భోగ మోక్ష ఫలప్రదః ||
సర జన్మ గణాధీశా పూర్వజో ముక్తి మార్గకృత్ |
సర్వాగమ ప్రణీతాచ వాంచితార్ధ ప్రదర్శినః ||
అష్ట వింశతి నామాని మదీయానీతి యః పఠేత్ |
ప్రత్యుషే శ్రద్ధయా యుక్తో మూకో వాచ పతిర్భవేత్ ||
మహామంత్ర మయానీతి మామనామాను కీర్తనం |
మహా ప్రజ్ఞా మవాప్నోతి నాత్ర కార్య విచారణా ||
వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు. పాములు అనేవి మనకి పరోక్షంగా చాలా మేలు చేస్తాయి. భూమి అంతర్భాగాలలో ఉంటూ భూమిని నాశనం చేసే క్రిముల్ని, పురుగుల్ని తినేసి మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి. అటువంటి పాముల్ని ఈ రోజున కొలిచి మనకి తిండికి, ఆరోగ్యానికి, సంతానానికి, ఏ రకమయినటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తాము. మన భారతీయుల చాల ఇళ్ళల్లో ఇలవేల్పు " సుబ్రహ్మణేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తారు కాబట్టి వారి పేరును చాల మంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు వగైరా పేర్లు పెట్తుకుంటూ ఉంటారు.
వ్రతం ఆచరించే పద్ధతి / ఫూజ చేయు విధానము : దైవారాధన ఒక నమ్మకము ... ఏనాడూ నమ్మకము మూడనమ్మకము కాకూడదు !. మూడనమ్మకాలు జీవితంలో అనర్ధాలకు దారితీయును . నమ్మకము ... మనశ్శాంతిని, మనోబలాన్ని ఇస్తుంది. నాగులచవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి. ... , ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తర్వాత పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి. నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమనుగానీ, లేదా ఫోటోనుగానీ పూజకు ఉపయోగించాలి. పూజకు మందారపూల, ఎర్రటి పువ్వులు, కనకాంబరములు.. నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. ఉదయం 9 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతిః, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో "ఓం నాగేంద్రస్వామినే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
దీపారాధనకు నువ్వులనూనెను వాడాలి. 7 దూదివత్తులు, ఆవునేతితో సిద్ధం చేసుకున్న దీపముతో హారతినిచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిశాక నాగేంద్ర స్వామి నిత్యపూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి. తరువాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలుపోసి పూజ చేయాలి. పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. ఇది వ్రతం ఆచరించే పద్ధతి. నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. అలాగే.. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించడం శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు. చెవిబాధలు, కంటిబాధలు ఉన్నవాళ్లకు చవితి ఉపవాసం మంచిది. నాగవస్త్రాలు పుట్టమీద పెట్టి తీసి ధరిస్తే మనోరథాలు తీరుతాయి.బాలబాలికలు దీపావళి రాత్రి నాగదివ్వెలను వెలిగించే చవితిని స్మరించి ఆహ్వానిస్తారు. దీపావళి పండుగ వెళ్లిన నాలుగోనాడు మనకు నాగులచవితి వస్తుంది.
సంతానానికి సర్ప పూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మ పురాణంలో ఒక కథ ఉంది.
శూరసేనుడు చంద్రవంశపు రాజు. శూరసేనుడు అతని భార్య సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు. చివరికి వారికి ఒక సర్పం పుట్టింది. ఆ సర్పాన్నే వీరు పెంచుతూ వచ్చారు. కొన్నాళ్లకు ఆ సర్పం మనుషుల భాషలో మాట్లా డింది. ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరింది. రాజు అలాగే చేశాడు. కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరింది. ఖడ్గాన్ని పంపి ఒక రాకుమార్తెతో పెళ్లిచేసి రప్పించారు. ఆమె అత్తింటికి వచ్చి తన మగడు ఒక పాము అని తెలుసుకుంది. ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలసిమెలసి ఉంటూ ఉండేది. నన్ను చూసి నీవు ఎందుకు భయపడవు అని పాము ఆమెను అడిగింది. భర్త ఎట్టివాడైనా స్త్రీకి దైవసమానుడు. దైవాన్ని చూసి భయపడడం దేనికి అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి గౌతమినదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాపవిమోచనం పొందాడు.
"చలిప్రవేశించు నాగులచవితి నాడు మెరయు వేసవి రథసప్తమీ దివసమున అచ్చసీతు ప్రవేశించు పెరిగి మార్గశిర పౌష మాసాల మధ్య వేళ'' అని శివరాత్రి మాహాత్మ్యంలో శ్రీనాథుడు పేర్కొన్నాడు. చలికాలం ఆరంభమయ్యే కార్తీకమాసంలో చవితినాడు నాగపూజ చేయడం ఆంధ్రదేశంలో ప్రాచీనకాలం నుంచీ వస్తున్న సంప్రదాయం.
భవిష్యపురాణం 'నాగదష్టవ్రతం' గురించి చెబుతోంది.
''నాగదష్టో సరో రాజన్ ప్రాప్యమృత్యుం ప్రజత్యథః అధోగత్వా భవేత్సర్పో నిర్తిషో నాత్ర సంశయః''-
''రాజా! పాముకాటు పొందిన నరుడు మరణించిన పిదప పాతాళ లోకానికి పోయి విషరహితుడై సర్పజన్మ పొందుతా''డని సుమంతుడు చెప్పగా శతానీకుడు పాముకరచినవాని కుటుంబీకులు అతని మోక్షప్రాప్తికి ఏమి చేయాలని ప్రశ్నిస్తే నాగపూజను వివరించినట్లు కథ. కొన్నిచోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే, కొన్ని ప్రాంతాల ప్రజలు కార్తీక చతుర్థినాడు నాగపూజ చేయడం పరిపాటి. స్కందపురాణంలో దీనిని 'శాంతి వ్రతం' అన్నారు.
హైందవ సంప్రదాయంలోనే గాక జైన బౌద్ధధర్మాల్లోను నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది. అమరావతీ స్తూపంలో ఫణీంద్రుడు పడగవిప్పిన చిత్రాలు ఉన్నాయి. దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది. శివుడు నాగభూషణుడు, అతని వింటినారి వాసుకి. శ్రీమహావిష్ణువు మేను వాల్చింది నాగతల్పం పైనే. వినాయకునికి సర్పం ఆభరణం, యజ్ఞోపవీతం కూడా. కుమారస్వామి వాహనమైన మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకొని ఉంటాయి. ఆంధ్రదేశం దాదాపు 2500 సంవత్సరాల క్రితం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్లు, వారివల్లనే ఈ దేశానికి నాగభూమి అని పేరు ఏర్పడిందని బౌద్ధగాథలు వెల్లడిస్తున్నాయి. సర్పం జాతీయచిహ్నంగా గల ప్రాచీన తెగ నాగులని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఆంధ్రదేశంలో నాగపూజ పరంపరాగతంగా వస్తోంది. శాతవాహనుల నాటి బౌద్ధాచార్యుడు నాగార్జునుని పేరులో నాగశబ్దం ఉంది. నాగవరం, నాగపట్నం, నాగులపాడు మొదలైన గ్రామనామాలు; నాగయ్య, నాగమ్మ వంటి వ్యక్తి నామాలు; నాగులేరు, నాగరం, నాగుల చీర మొదలైన విశేషనామాలు తెలుగునాట ప్రసిద్ధం. అమరావతి స్తూపంలో నాగబు శాసనస్థమైన తొలి తెలుగు మాటగా వేటూరి ప్రభాకరశాస్త్రి గుర్తించారు. మహావిష్ణువు చాతుర్మాస్యానంతరం నిద్రలేచే ఉత్థానేకాదశికి ఈ నాగులచవితి దగ్గరగా ఉన్నందున కార్తీక శుద్ధ చవితి నాడే నాగపూజ ఆంధ్రుల ఆచారం. ఆనాడు జ్యోతిర్మండలంలో అనంత శయనాకృతి కనిపిస్తుందని చెబుతారు.
నాగుల చవితికి మిగతా పండుగాల్లాగా ఇళ్ళకు సున్నాలు అవీ పూయకూడదు. ఇళ్ళల్లో కానీ, పొలాల్లో కానీ కన్నాలు ఉంటే పూడ్చాకూడదు. ఇల్లు తుడిచాక ముగ్గుపిండితో ముగ్గు పెట్టకూడదు. సుద్దముక్కలు లేకపోతే చాక్ పీస్ లతో ముగ్గు పెట్టాలి. అన్ని గుమ్మాలకీ, తలుపులకీ ఆస్తిక అని వ్రాయాలి. ఆస్తికుడు ఎవరంటే .... అర్జునుని కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడు యుద్ధంలో మరణించినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. అనాలోచితంగా చేసిన పాప ఫలితంగా, శాపఫలితంగా పరీక్షిత్తు పాముకాటు వలన మరణిస్తాడు. తండ్రి మరణానికి ప్రతీకారంగా జనమేజయుడు పాముజాతిని మట్టుపెట్టాలని సర్పయాగాన్ని నిర్వహిస్తాడు. యాగం మధ్యలో సర్పజాతిని రక్షించటానికి ఆస్తికుడు వచ్చి తన మాటల చాతుర్యంతో జనమేజయున్ని ఒప్పించి సర్పయాగాన్ని ఆపి జగత్కళ్యాణ కారకుడు అవుతాడు. అందుకే నాగులచవితి రోజు ప్రతి వాకిలి దగ్గరా ఆస్తీక అని వ్రాసి సర్పజాతిని కాపాడినవాడిని తలచుకోవడం జరుగుతుంది.
పాముల ఉపయోగాలు : ప్రతి జీవి ఇంకొక జీవికి ఏదోవిధం గా ఉపయోగపడుతూ ఉంటుంది . దీనినే సమన్వయ సహకారము (Symbiosis ) అంటాము . అన్ని జీవుల మాదిరిగానే పాములూ ' జీవపరిణామ క్రమము '(Theory of Evaluation of species(life))లో భాగం గానే ఉద్భవించాయి అని అనడంలో సందేహము లేదు నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులతో ఉపయోగిస్తారని ఆయుర్వేదశాస్త్రం చెబుతోంది. నాగులచవితి రోజున ఉపవాసం ఉండి పాముపుట్టను పూజించాలి. పుట్టలో ఆవుపాలు పోయాలి. పుట్టను పూజించే అవకాశం లేనప్పుడు నాగవిగ్రహాన్ని పాలతో అభిషేకించాలి. సాధారణంగా ప్రతిచోట ఆలయాలలోనూ, రావి, వేప చెట్ల క్రిందా ఈ నాగవిగ్రహాలు / నాగబంధం ఉంటుంది.
ఒక విషయం గుర్తుంచుకోండి. పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు, దేవతసర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మాములు పాములు పాలు త్రాగితే అరగక కక్కెస్తాయి, మరణిస్తాయి కూడా. దేవత సర్పాలు ఎక్కడపడితే అక్కడ ఉండవు. మనిషి కంటికి కనిపించవు, అంటే మానవ కదలికలను లేని మహారణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టలో పాక్యేట్ల కొద్ది పాలు పోయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి, రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగితావి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. నాగదేవత పూజలో పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడవద్దు. పసుపు అంటే పాములకు అలర్జీ. పసుపు వాటి శరీరానికి అంటుకోవడం వలన కూడా అవి మరణీంచే అవకాశం ఉంటుంది. పండుగ పూట పాపం చేయకండి. పసుపుకుంకుమలను పుట్టదగ్గరవాడకండి.
పుట్ట దగ్గర / నాగబంధం దగ్గర పూజించాకా, ఇంటి గడప దగ్గర కూడా పాలుపోయాలి. ప్రతి ఇంటి గుమ్మం దగ్గర నాగరాజు కొలువుండి ఇంటిని రక్షిస్తుంటాడు. కనుక ఇంటి గడప మీద పాలు పోయండి, కాసింత చిమ్మిలి, చలివిడి పెట్టండి, ఒక అరటిపండు ముక్క పెట్టండి. మరునాడు ఇంట్లో బంగారంతో కాని,వెండితో కాని,కొయ్యతో(చెక్క) కాని,మట్టితో కాని చేసిన నాగప్రతిమను పంచామృతాలతోనూ,జాజి,సంపెంగ లాంటి సువాసనగల పూలతోనూ పూజించాలి. ఈ నాగపూజ వలన సర్పదోషాలు నశిస్తాయి.