విగ్రహారాధన ఎందుకు ముఖ్యం??
【న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసఙ్గనామ్ | జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్॥
ఈ లోకంలో ఎంతో మంది ఆత్మజ్ఞానము కలిగిన వారు ఉన్నారు. ఏమీ తెలియని అజ్ఞానులు ఉన్నారు. అజ్ఞానులు కామ్యకర్మలను ఆసక్తితో చేస్తుంటారు. వివిధ రూపాలతో, నామాలతో, దేవుళ్లను పూజిస్తుంటారు. అటువంటి వారిని చూసి జ్ఞానులు, వాళ్లు సక్రమ మార్గంలో లేరని చెప్పకూడదు. అలా చేస్తే వారు చేసే కర్మలను కూడా చేయకుండా సోమరులుగా మారిపోతారు. జ్ఞానులు అయిన వాళ్లు తాము కర్మలు ఎలా చేయాలో ముందు తాము చేసి, అజ్ఞానులకు చూపించి, వారికి నచ్చచెప్పి, వారితో నిష్కామ కర్మలను చేయించాలి. వారికి మార్గదర్శకులు కావాలి.】
ఇక్కడ పరమాత్మ మరొక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాడు. ఇందాక చెప్పినట్టు లోకంలో జ్ఞానులు అంటే అన్నీ తెలిసిన వారే కాదు, అజ్ఞానులు అంటే ఏమీ తెలియని వారు, తెలిసీ తెలియని వారు కూడా ఉంటారు. అజ్ఞానులు సాధారణంగా ఏదో ఒక ఫలితాన్ని ఆశించి కర్మలు చేయడంలో నిమగ్నమయి ఉంటారు. అలాంటప్పుడు, జ్ఞాని అయిన వాడు అజ్ఞానుల నమ్మకాలను పాడు చేయకూడదు. వారి నమ్మకాలను మూఢనమ్మకాలని కొట్టి పారేయకూడదు. క్రమక్రమంగా వారికి నచ్చచెప్పాలి, వారిని సక్రమమైన మార్గంలో పెట్టాలి. అలాకాకుండా, ఒక్కసారిగా వారు చేసేది తప్పు అని ఖండిస్తే వారు దిక్కుతోచని వారైపోతారు. ఎందుకంటే ప్రతి వాడు కూడా నేను ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఆ ఫలితం నేను అనుభవిస్తాను అనే నమ్మకంతోనే కర్మలు చేస్తాడు. వాడి నమ్మకాన్ని జ్ఞాని తుంచేయకూడదు.
మరి ఏం చేయాలి అని అందరికీ సందేహం వస్తుంది. అంటే అజ్ఞాని చేసే కర్మలనే జ్ఞాని ఫలాపేక్షరహితంగా, స్వార్ధరహితంగా ముందు తాను చేస్తూ, అజ్ఞానిని కూడా ఆ విధంగా చేయమని ప్రోత్సహించాలి. అప్పుడు అజ్ఞాని కూడా స్వార్ధం లేకుండా కర్మలు చేస్తాడు.
అజ్ఞానులు నిష్కామ కర్మతత్వము తెలియక, తాము చేసేది మంచిది అనే భావనతో, శ్రద్ధతో, ఎంతో కొంత ప్రతిఫలం ఆశించి, కర్మలు చేస్తుంటారు. అన్నీ తెలిసిన వాడు వెంటనే "నీవు చేసేది తప్పు, నీకు పాపం వస్తుంది అని మొహం మీద చెప్పకూడదు. అలా చెబితే అజ్ఞానులు “నీకేం తెలియదు పో" అనే వారు కూడా ఉంటారు. మరి కొందరు అసలు కర్మలు చేయడమే మానేస్తారు. మరి కొందరు రెచ్చిపోయి ఇంకా స్వార్ధపూరిత కర్మలు చేస్తారు. దానితో అంతా రసాభాస అవుతుంది. కాబట్టి జ్ఞాని అయిన వాడు అలా చేయకూడదు. తాను మాత్రము ఇంద్రియములను, మనస్సును నిగ్రహించి, శ్రద్ధతో, ఓర్పుతో వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాలి. వారు చేసే కర్మలనే తాను అనాసక్తంగా, స్వార్ధరహితంగా, ఫలం ఆశించ కుండా చేసి, దాని వలన కలిగే లాభాలను వారికి తెలియబరచి, వారిని కూడా ఆ విధంగా చేయడానికి ప్రోత్సహించాలి. జ్ఞానులు చేసే కర్మలను చూచి, దాని వలన వచ్చే మంచి ఫలితములను గ్రహించి, అజ్ఞానులు కూడా ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తారు. మంచి మార్గంలో నడుస్తారు. కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక విషయం స్పష్టం చేసాడు. కేవలం ఉపన్యాసాలు ఇచ్చి తెలియని వారి మనసులు పాడుచేయకుండా, తాను ఆచరించి ఇతరులచేత ఆచరింపజేయడం మంచిది అని స్పష్టంగా చెప్పాడు.
మరి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్లు తత్వమును బోధించే వాళ్లు ఇలా ఎందుకు చెబుతున్నారు. వాళ్లకు తెలియదా అంటే అన్నీ తెలుసు. కానీ, ఎవరికి, ఏ విషయాన్ని, ఏసమయంలో ఎలా బోధించాలో తెలియదు అంతే. మన వేదాలలో శాస్త్రాలలో అన్నీ చెప్పారు. విగ్రహారాధన, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ చెప్పారు. ఆత్మతత్వము, నిర్గుణ బ్రహ్మము, నిర్గుణారాధన, మానసిక పూజ, ఓంకారము, ధ్యానము, మనసును ఆత్మలో సంయోగం చేయడం. ఇవి కూడా చెప్పారు. ఇవన్నీ నిర్దిష్టమైన పద్ధతిలో చేయాలి. ఒకటి వెంబడి ఒకటిగా చేయాలి. మనకు చదువు నేర్పేటప్పుడు, ఒకటో క్లాసునుండి పదవ తరగతి వరకు వివిధ విషయాలు చెబుతారు. ఇంటర్ ఇటు స్కూలు విద్య, అటు కాలేజీ విద్యకు అనుసంధానంగా పాఠాలు చెబుతారు. తరువాత కాలేజీ విద్య చెబుతారు. తరువాత మాస్టర్ విద్యచెబుతారు. ఇలా అంశాల వారీగా చెబుతారు అంతేకానీ ఒకే సారి యం.ఏ. పిహెచ్.డి విద్య పదేళ్ల వయసులో చెప్పరు. అలాగే ఎం.ఏ పాసయిన వాడు, రెండో తరగతి విద్యార్థికి పాఠం చెప్పేటప్పుడు తన ఎం. ఏ విద్యను ప్రదర్శించకూడా, రెండో తరగతి విద్యార్ధి స్థాయికి తగ్గట్టుగా చెప్పి క్రమక్రమంగా వాడిని వృద్ధిలోకి తీసుకురావాలి.
అలాగే ముందు మనసు నిలవడానికి విగ్రహారాధన, సంధ్యావందనము, పూజలు, వ్రతాలు, దేవాలయాలు, ఉత్సవాలు చేయమన్నారు. ఏమీ తెలియని వారిని అలాగే చేయమనాలి. అప్పుడు వారికి దైవం అంటే ఏమిటో తెలుస్తుంది. వారి మనసు దైవం మీదికి మళ్లుతుంది. మనసు దైవం మీద నిలకడగా ఉంటుంది. అప్పుడు నిర్గుణారాధన, మానసిక పూజ ఆత్మను గురించి బోధించాలి. తరువాత మోక్షం కొరకు ప్రయత్నించాలి. ఇది కూడా జ్ఞానులు ముందు తాము మనస్ఫూర్తిగా, యుక్తమైన మనసుతో శ్రద్ధగా, ఆచరించి ఇతరులు కూడా తాము చేసిన విధంగా చేయమని ప్రోత్సహించాలి. అంతేకానీ విగ్రహారాధన పనికిరాదు, పూజలు వ్రతాలు దండగ అని మొదలుపెడితే వాళ్లు అటు పూజలు చెయ్యడం మానేస్తారు. ఇటు ధ్యానం చేయడం చేత కాదు. రెండింటికి చెడ్డవారు అవుతారు. అదే ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ.
◆ వెంకటేష్ పువ్వాడ